హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో రెండో రోజు తీర్మానాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ‘‘భాగ్యనగర డిక్లరేషన్ ’’ పేరుతో ఈ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు …కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా మోదీ ప్రతిష్టను దిగజార్చాలని కుట్రలు చేస్తోందని అన్నారు.
ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ ప్రతికూల రాజకీయాలు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ భ్రమల్లోనే ఉంటుందని ఎద్దేవా చేశారు. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
కొవిడ్, సర్జికల్ స్ట్రైక్స్, రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడం, ఇలా ప్రతి అంశంపైనా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అవకాశవాద, అవినీతి రాజకీయాలకు కాంగ్రెస్ వేదికగా మారిందని అమిత్ షా అన్నారు.
ఇక పశ్చిమబెంగాల్, తెలంగాణలో బీజేపీలో అధికారంలోకి వస్తుందని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. గుజరాత్, హిమాచల్ప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరి జరిగే ఎన్నికలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు చేశారు.
దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ఎంపీలు తమ నియోజకవర్గాల్లోకి వెళ్లాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈ సమావేశాల తర్వాత 3 రోజుల పాటు ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా 200 పార్లమెంట్ నియోజకవర్గాలను గుర్తించి, కేంద్ర మంత్రులను ఈ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జులుగా నియమించారు.