దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. కరోనాను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోందని చెప్పుకొచ్చారు. హర్యానాలోని కదర్పూర్ గ్రామంలో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్ ఒకటని అన్నారు. ఇంత జనాభా ఉన్న మన దేశంలో కరోనాను ఎలా ఎదుర్కొంటారని అందరూ ఆందోళన చెందారని ఆయన చెప్పారు.
కరోనాపై సమర్థవంతంగా పోరాడుతున్నందుకు ప్రపంచం మొత్తం మన దేశంవైపే చూస్తోందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సారథ్యంలో ఇది సాధ్యమవుతోందని చెప్పుకొచ్చారు.కరోనాపై ముందుండి పోరాడుతున్న యోధులకు వందనం చేస్తున్నానని అమిత్ షా తెలిపారు. కరోనాపై పోరాటంలో భద్రతా దళాల పాత్రను ఆయన కొనియాడారు. కరోనాపై చేస్తోన్న ఈ యుద్ధంలో మన భద్రతా దళాలు గొప్ప పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.