సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే ఏషియన్ ఫిల్మ్స్ సంస్థతో కలిసి ఏఎంబీ సినిమాస్ పేరిట ఓ మల్టీప్లెక్స్ను నిర్మించారు. గచ్చిబౌలిలో అధునాతన సౌకర్యాలతో ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం జరుపుకోగా, ఇందులో మొత్తం 1638 సీటింగ్ కెపాసిటీతో 7 స్క్రీన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ థియేటర్లో సినిమా చూడడానికి అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక కమర్షియల్ ప్రయోజనాలే కాకుండా సామాజిక సేవల పరంగానూ ఏఎంబీ సినిమాస్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనేక ఛారిటీ కార్యక్రమాల కోసం ఉచితంగా సినిమాల ప్రదర్శనలతో మహేష్ బాబు ఆశయాలకు అనుగుణంగా నడుస్తోంది. తాజాగా, ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్ కు బెస్ట్ మల్టీప్లెక్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. బిగ్ సినీ అవార్డ్స్-2019లో భాగంగా తమ మల్టీప్లెక్స్ కు అవార్డు రావడం పట్ల మహేష్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. పట్టరానంత ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. ఈ శుభసమయాన ఏఎంబీ సినిమాస్ సిబ్బందికి తన హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుకుంటున్నానని వ్యాఖ్యానించారు. సిబ్బంది భాగస్వామ్యం, శ్రమ ఫలితమే ఈ అవార్డు అని మహేష్ బాబు పేర్కొన్నారు.
previous post
సమంతా వల్లే అదంతా నేర్చుకున్నా..