ఫ్లిప్కార్ట్, అమెజాన్ సంస్థలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కర్నాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. తమ అంతర్గత వ్యాపార విధానాలపై సీసీఐ దర్యాప్తును నిలిపివేయాలంటూ ఈ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. విచారణకు హాజరయ్యేందుకు 4 వారాల సమయం కేటాయించింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలు మార్కెట్ పోటీతత్వ చట్టాలను ఉల్లంఘిస్తూ కొంతమంది విక్రేతలను మాత్రమే ప్రోత్సహిస్తున్నాయని భారత్లోని వ్యాపార సంస్థలు చేసిన ఆరోపణలను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పరిగణనలోకి తీసుకుంది. గతేడాది జనవరిలో ఈ సంస్థలపై విచారణకు ఆదేశించింది. ఈ ఆరోపణలను అమెజాన్, ఫ్లిప్కార్ట్ కొట్టిపారేశాయి.
ఈ సంస్థలకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ‘‘అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటివి పెద్ద సంస్థలు.. దర్యాప్తు, పారదర్శకత వంటి అంశాల్లో స్వచ్ఛందంగా వ్యవహరించాలి. ఇలాంటి విచారణలకు ముందుకు రావాలి. కానీ మీరే దర్యాప్తు జరగకూడదని అనుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారంలో విచారణ జరగాలి. మీరు నివేదికలు సమర్పించాలి’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెల్లడించింది. 4 వారాల్లోగా విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది.
సీసీఐ ఎలాంటి రుజువులు లేకుండానే దర్యాప్తు చేపట్టిందని ఆరోపిస్తూ గత నెలలో కర్ణాటక హైకోర్టులో అమెజాన్, ప్లిప్ కార్ట్ సంస్థలు పిటిషన్ వేశాయి. అయితే అక్కడా వీటికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ-కామర్స్ సంస్థల పిటిషన్లకు విచారణయోగ్యత లేదంటూ జులై 23న కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. వీటి వ్యాపార విధానాలపై విచారణ జరపాల్సిందేనని తేల్చిచెప్పింది.