న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర తిరుపతికి చేరుకుంది. తుళ్లూరులో చేపట్టిన మహాపాదయాత్ర కొండలు, గుట్టలు, వాగులు వంకలు దాటుకుని ఎండనక, వాననక సాగి తిరుపతి చేరింది.
ఈ యాత్రలో 43వ రోజు సోమవారం తిరుపతి చేరుకుంది. మంగళవారం తిరుపతి నగరం గుండా సాగుతూ శ్రీవారి పాదాల చెంత అలిపిరి చేరుకుంటుంది. అక్కడ సమితి నిర్వాహకులు, పాదయాత్ర బృందం కొబ్బరికాయలు కొట్టి పాదయాత్రను ముగించనున్నారు. బుధవారం స్వామివారి దర్శనాలు చేసుకోనున్న రైతులు 17వ తేదీన అమరావతి ఆకాంక్షను చాటేలా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా రేణిగుంటలోని వైకన్వెన్షన్ హాలు నుంచి ప్రారంభమైన పాదయాత్ర మధ్యలో వర్షం కురిసినా ఆగలేదు. వర్షంలో తడుస్తూనే అమరావతి రైతు లు పాదయాత్ర కొనసాగించారు.
తిరునగరిలో అన్నదాతలకు పుర ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చి మద్దతు పలికారు. రహదారి వెంబడి నిలబడి సంఘీభావం తెలుపుతూ ఘనస్వాగతం పలికారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జై అమరావతి అంటూ నినదించారు. జనసందోహంతో ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి.
వైకాపా మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రైతులకు నీరాజనాలు పలికారు. రేణిగుంట వద్ద మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు మాజీ ఎంపీ కొనకళ్ల సత్యనారాయణ రైతులకు సంఘీభావం తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గం తరఫున 12 లక్షల 69 వేల 999 రూపాయలను పాదయాత్రకు విరాళం అందించారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రైతులతో కలిసి నడిచారు.