ఏపీ అసెంబ్లీ లో రాజధాని అమరావతిపై వాడిగా వేడిగా చర్చ సాగింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సభలో ప్రస్తావించిన అంశాలపై అధికార పార్టీ సభ్యులు విమర్శలు గుప్పించారు. సభలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మట్లాడుతూ చంద్రబాబు తన ప్రసంగంలో అమరావతిపై అసలే మాట్లాడలేదన్నారు. ఏం చెప్పాలో తెలియక చంద్రబాబు అయోమయానికి గురవుతున్నారని ఎద్దేవా చేశారు. చివర్లో మీడియాకోసం అమరావతి పేరును ప్రస్తావించారన్నారు.
కొత్త రాష్ట్రంగా ఉన్న ఏపీ అభివృద్ధికి తొలి పది సంవత్సారాలే కీలకమన్నారు. రాజధాని ప్రాంత నిర్ణయంపై శివరామకృష్ణతో కూడిన నిఫుణుల కమిటీ సమర్పించిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టకపోగా, కొత్తగా నారాయణ కమిటీ ని వేసుకున్నారని టీడీపీని దుయ్యబట్టారు. 60ఏళ్లు అందరం కలిసి కట్టుగా కష్టపడి ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు. విభజన అనంతరం మనకు కొన్ని సవాళ్లు ఏర్పడ్డాయన్నారు. ఒక్క వ్యవసాయంమీదే ఆధారపడే పరిస్థితి ఇక్కడ ఏర్పడిందన్నారు. కొత్త రాష్ట్రంలో ఏడు జిల్లాలుకుపైగా ప్రాంతాలు విపరీతంగా వెనకబడ్డాయని తెలిపారు.