స్టైలిష్స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘అల వైకుంఠపురములో…’ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో జయరాం, టబు, మురళీశర్మ, సచిన్ ఖేడేకర్, సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు తమన్ సంగీత సారథ్యం వహించారు. ఇటీవలే విడుదల చేసిన ‘సామజవరగమన’, ‘రాములో రాముల’, ‘ఓ డాడీ’ పాటలు చిత్రంపై అంచనాల్ని తారాస్థాయికి చేర్చాయి. ఈ పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. మొదటి పాట ‘సామజవరగమన’ కు ఇప్పటివరకు యూట్యూబ్లో 100 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. సౌత్ ఇండియా సినిమా చరిత్రలో ఒక పాటకు 100 మిలియన్ వ్యూస్ రావడం ఇదే ప్రథమం. తాజాగా రాములో రాముల.. సాంగ్ వంద మిలియన్ మార్కును చేరుకున్న క్రమంలో ఆయన తన అభిమానులకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సాంగ్ ఎంతో మంది హృదయాలని గెలుచుకుంది. వంద మిలియన్ వ్యూస్ అనేది చాలా పెద్ద విషయం. మీ ప్రేమ వలననే ఇది సాధ్యమైందని బన్నీ పేర్కొన్నాడు.
previous post
జగన్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు..