రాష్ట్ర పోలీసులు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న అల్-ఖైదా ఇండియన్ సబ్కాంటినెంట్ (ఏక్యూఐఎస్) ఉగ్రవాదిని అరెస్టు చేశారు. మూడేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది కలీముద్దీన్ ముజాహిరీని అదుపులోకి తీసుకున్నట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు. ఈ ఉగ్రవాదిని పట్టుకొనేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏటీఎస్ బృందం జంషెడ్పూర్లోని టాటానగర్ రైల్వేస్టేషన్లో నిందితుడిని అరెస్టు చేసినట్లు వివరించారు. ఆజాద్ నగర్లోని తన ఇంటికి కలీముద్దీన్ రాబోతున్నాడనే సమాచారంతో నిఘా వేసినట్లు చెప్పారు.
ఈ ఉగ్రవాది తరచూ తాను ఉండే ప్రదేశాలు మారుస్తుండటంతో అతణ్ని పట్టుకోవడం సవాలుగా మారింది. అందుకే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుడి కదలికలు పసిగట్టాం. ఇతడి అరెస్టు ద్వారా జార్ఖండ్లో ఈ ఉగ్రవాద గ్రూప్ కదలికల గురించి ఆరా తీస్తున్నాం. యువతను ప్రేరేపించి వారిని ఏక్యూఐఎస్లో చేర్పించేందుకు కలీముద్దీన్ ప్రయత్నించేవాడు. అంతేకాక అతడికి అల్-ఖైదా ఉన్నత నాయకులతో సంబంధాలు కూడా ఉన్నాయి. అని అదనపు డీజీపీ మురారీలాల్ మీనా వెల్లడించారు.