ఆళ్లగడ్డలోని వివిధ పార్టీల ద్వితీయ శ్రేణి నేతల ఇళ్లల్లో బుధవారం అర్ధరాత్రి పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. మంత్రి భూమ అఖిలప్రియ అనుచరుల ఇళ్లల్లోనూ పోలీసులు సోదాలు జరిపారు. దీంతో సదరు వ్యక్తులు మంత్రికి ఫిర్యాదు చేయడంతో చేయడంతో సోదాల విషయమై ఆమె స్థానిక పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పై అధికారుల ఆదేశాల మేరకు అనుమానమున్న అందరి ఇళ్లల్లోనూ సోదాలు చేశామని పోలీసులు చెప్పారు. తన వర్గీయుల ఇళ్లపైనే ఆకస్మిక దాడులు నిర్వహిస్తారా? అంటూ గురువారం రాత్రి గన్మెన్లను పిలిచి.. వెళ్లిపోవాలని అఖిలప్రియ ఆదేశించారు.
జరిగిన విషయాన్ని గన్మెన్లు ఉన్నతాధికారులకు చెప్పగా, వారు మంత్రితో మాట్లాడి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. అయినప్పటికీ శాంతించని మంత్రి ముందు గన్మెన్లు బయటకు వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తోడెండ్లపల్లి, రుద్రవరం మండలం నరసాపురం గ్రామాల్లో సభల్లో మంత్రి అఖిలప్రియ పాల్గొన్నారు. అనంతరం ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న మంత్రికి భద్రత కల్పించేందుకు స్థానిక ఎస్ఐలు, పోలీసులు వెంట రావడంతో మంత్రి మరోసారి మండిపడ్డారు.