కాంగ్రెస్ పార్టీ ఎఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కు హైకోర్టు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేశారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణలు ప్రేరేపించే విధంగా శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారని రామారావు ఆ ఫిర్యాదులో ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో శాంతి భద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తుందని ప్రముఖ న్యాయవాది రామారావు ఆరోపించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ షిర్యాదు పై దర్యాప్తు చేయనుంది.
ఈ నెల 7వ తేదీన రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేసింది.
అయితే రాహుల్ గాంధీ సమావేశానికి ఓయూ వీసీ రవీందర్ అనుమతి ఇవ్వలేదు. రాజకీయ పార్టీల సమావేశాలు, సభలకు అనుమతివ్వకూడదనే నిర్ణయంలో భాగంగానే రాహుల్ మీటింగ్ కు అనుమతివ్వలేదని ఓయూ వీసీ రవీందర్ చెప్పారు.
మరోవైపు కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం మాత్రం రాహుల్ సభకు అనుమతించాల్సిందేనని పట్టుబడుతోంది. ఈ క్రమంలో ఓయూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అయితే రాహుల్ గాంధీ మీటింగ్ కి రాజకీయాలతో సంబంధం లేదని కూడా కాంగ్రెస్ ప్రకటించింది. రాహుల్ గాంధీ సమావేశానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఓయూ వీసిని ఆదేశించింది.