కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా నివారణకు అన్ని దేశ ప్రభుత్వాలు, ప్రజలు తగు చర్యలు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా నెలకొంది అంతే ధీటుగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం నివారణ కార్యక్రమాలు చేస్తున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నివారణ చర్యలకు మద్దతుగా పలువురు పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు భారీ ఎత్తున ఆర్ధిక సహకారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ఆదిత్య మ్యూజిక్ సంస్థ కరోనా నివారణకు తమ వంతుగా ఆర్ధిక సహకారం అందించడానికి ముందుకొచ్చారు. ఆదిత్య మ్యూజిక్ అధినేతలు ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా, దినేశ్ గుప్తా, ఆదిత్య గుప్తాలు తాజాగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావుని కలిసి కరోనా నివారణ చర్యలకు గాను సీఎం రిలీఫ్ ఫండ్కు 31 లక్షల విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆదిత్య మ్యూజిక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉమేశ్ గుప్తా మాట్లాడుతూ.. కరోనా కారణంగా యావత్ మానవాళి ఇబ్బందుల్లో పడింది. ఈ మహమ్మారి నివారణకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నివారణ చర్యలు చాలా అభినందనీయం. అలానే ఈ లాక్ డౌన్కి సహకరిస్తూ ప్రజలంతా సేఫ్గా ఇళ్లకే పరిమితమవ్వడంతో ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టకలుగుతున్నాం. ఇలాంటి కఠినమైన సమయంలో సైతం ఎలాంటి ప్రమాదాల్ని లెక్క చేయకుండా ఎంతో మంది పోలీసులు, వైద్య, శానిటరీ సిబ్బంది మనందరి కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. వారిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ప్రభుత్వం వారు చేస్తున్న సూచనలు తప్పక పాటిస్తూ ఇలానే సెల్ఫ్ ఐసోలేషన్లో ప్రజలంతా ఉంటే తొందర్లోనే సంపూర్ణంగా కరోనా నివారణ జరిగే అవకాశం ఉంది. దీనికి ఆ దేవుడు కూడా సహకరించాలని మన:స్పూర్తిగా ప్రార్ధిస్తున్నాను..’’ అని తెలిపారు.