నటుడు సుభాష్ చంద్రబోస్ ఇక లేరు. ఆయన నిన్నే పెళ్లాడుతా, ఇడియట్, శివమణి, అల్లరి రాముడు వంటి సినిమాలతోనే కాకుండా, అనేక టీవీ సీరియళ్లతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆయన నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ కృష్ణానగర్ లోని తన నివాసంలో ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దాని తో తలకు బలమైన గాయాలు తగిలాయి. బోస్ అప్పటినుంచి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కానీ, తలకు తగిలిన దెబ్బలు తీవ్రమైనవి కావడంతో ప్రాణాలు విడిచారు.
సినీ, టీవీ రంగాలలో బోస్ మరణంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనతో అనుబంధం ఉన్న నటీనటులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సుభాష్ చంద్రబోస్ దాదాపు మూడు దశాబ్దాలుగా నట ప్రస్థానం కొనసాగిస్తున్నారు. సుమన్ హీరోగా వచ్చిన సాహసపుత్రుడు చిత్రంతో సినీ రంగానికి పరిచయం అయ్యారు. బోస్ ను పూరీ జగన్నాథ్, కృష్ణవంశీ ఎక్కువగా ప్రోత్సహించారు.