telugu navyamedia
సినిమా వార్తలు

జాతీయ మెడికల్ కమిషన్ పై రాజశేఖర్ కామెంట్స్

Rajasekhar

తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన “జాతీయ మెడికల్ కమిషన్” (ఎన్.ఎం.సి) ద్వారా ఆయుర్వేద, యునాని, ఇతర వైద్యవిద్యను అభ్యసించినవారు ఎవరైనా కొత్తగా ప్రవేశపెట్టే ఆరు నెలల కోర్స్‌లో ఉత్తీర్ణత సాధిస్తే, ఎంబిబిఎస్ డాక్టర్స్ తరహాలో ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ బిల్లును ప్రముఖ నటుడు రాజశేఖర్ వ్యతిరేకిస్తున్నారు. బిల్లును వ్యతిరేకిస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్న జూనియర్ డాక్టర్లకు ఆయన మద్దతు ఇస్తూ ట్వీట్స్ చేశారు. మన దేశంలో ఇప్పటివరకూ నటీనటులు ఎవరూ ఎన్.ఎం.సి బిల్లుపై స్పందించలేదు. రాజశేఖర్ స్పందించడంతో జూనియర్ డాక్టర్ల నిరసనకు ప్రచారం దక్కింది. సామాన్య ప్రజలకు, సినిమా ప్రేక్షకులకు తెలిసింది. నాలుగేళ్లు ఎంబిబిఎస్ చదివి, తర్వాత ఓ ఏడాది హౌస్ సర్జన్‌గా సేవలు చేస్తే ప్రభుత్వం డాక్టర్ పట్టా చేతికి వస్తుంది. ఇప్పటివరకూ ఇదే పద్దతి నడిచింది.

ఈ విషయం గురించి రాజశేఖర్ మాట్లాడుతూ… “ఎన్.ఎం.సి బిల్లులో కొన్ని పరిమితులు ఉంటాయని చెప్పారు. అవేంటి? అనేది తెలియజేయలేదు. ఫలానా వ్యక్తికి వైద్య సేవలు అందించే అర్హత ఉందని, లేదని ఎలా చెబుతారు? ఎంబిబిఎస్ చదివి, తరవాత హౌస్ సర్జన్ చేయడం మామూలు విషయం కాదు. అదొక పెద్ద సబ్జెక్టు. ఆరు నెలలు క్రాష్ కోర్స్ చేస్తే సులభంగా డాక్టర్లు కావొచ్చంటే ఎలా? ఆరు నెలలలో ఎలా వైద్యుణ్ణి తయారు చేస్తారు? అనుకోనివి జరిగితే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ప్రాణాలతో చెలగాటం ఆడే ఇటువంటి బిల్లును ఒక వైద్యుడిగా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. క్రాష్ కోర్స్ చేయడానికి వైద్యవృత్తి ఏమైనా డ్రాయింగా? పెయింటింగా? ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో అనేకమంది దొంగ డాక్టర్లు చలామణీ అవుతున్నారు. ఇటువంటి బిల్లు వస్తే అటువంటి దొంగ డాక్టర్లకు ఆయుధం దొరికినట్టు ఉంటుంది” అని రాజశేఖర్ అన్నారు.

Related posts