ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో సినీ నటుడు పృథ్వి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్గా పదవీ ఇవ్వడంతో మర్యాద పూర్వకంగా సీఎంను పృథ్వీ కలిశారని సీఎం కార్యాలయ సిబ్బంది తెలిపింది. ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనను ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్ గా నియమిస్తూ జగన్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
జగన్ నిర్వహించిన పాదయాత్రలో పృథ్వి కూడా నడిచారు. ఓ చేత్తో వైసీపీ జెండాను పట్టుకుని, మరో చేత్తో జగన్ చేతిని పట్టుకుని ఆయన నడుస్తున్న ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా పృథ్వీ ప్రచారం చేశారు. ప్రచారంలో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. అంతేకాదు వైసీపీ విజయాన్ని సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోందని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. పృథ్వీతో పాటుగా నటుడు అలీ, పోసాని కృష్ణమురళి కూడా సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేశారు.