విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. సింగర్, తెలుగు బిగ్బాస్-3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్కు మద్దతు తెలిపారు. తాజాగా ప్రకాష్ రాజ్, రాహుల్ను తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వద్దకు తీసుకెళ్లారు. రాహుల్ సిప్లిగంజ్పై ఇటీవల పబ్లో జరిగిన దాడి ఘటన చర్చనీయాంశమైంది. మార్చి 5వ తేదీ అర్ధరాత్రి గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్లో రాహుల్, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రితేశ్ రెడ్డికి మధ్య మాటామాటా పెరగడంతో అది చివరకు దాడికి దారి తీసింది. రితేష్ రెడ్డితోపాటు ఆయన అనుచరులు బీరు బాటిళ్లతో రాహుల్పై దాడి చేశారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్లో లభించిన సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా రితేశ్ రెడ్డితో పాటు మరో ఆరుగురుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
సోమవారం పాతబస్తీలోని రాహుల్ సిప్లిగంజ్ ఇంటికి వచ్చిన ప్రకాష్ రాజ్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాహుల్పై దాడి చేయడం పెద్ద తప్పేనన్నారు. దాడి చేసినవాళ్లు ఎంత పెద్దవాళ్లైనా శిక్ష పడాల్సిందే అన్నారు. రాహుల్కు ఎవరూ లేరనుకోవద్దంటూ తన మద్దతు ఉంటుందని చెప్పకనే చెప్పారు. రాహుల్కు ఫ్యాన్స్ కూడా ఉన్నారని.. వారంతా చూస్తూ ఊరుకోరని ప్రకాష్ రాజ్ అన్నారు. ప్రకాష్ రాజ్, రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం ‘రంగమార్తాండ’ సినిమాలో చేస్తున్నారు. ఆ సినిమాకు సంబంధించి డబ్బింగ్ చెప్పడానికి వెళ్తూ రాహుల్ ఇంటి వద్ద ఆగానని, అతని కుటుంబంతో మాట్లాడానని చెప్పారు. ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కు ఇది రీమేక్. రమ్యకృష్ణ, ప్రకాష్రాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.