ఇండియాలో యూత్ కు మొన్నమొన్నటి దాకా మోడీ ఐకాన్ గా ఉండేవారు; ఇప్పుడు ఆయనను దాటేసి, అభినందన్ యువతకు రోల్ మోడల్ అయ్యాడు. తన మిగ్ యుద్ధ విమానంలో పాకిస్థాన్ లోకి దూసుకెళ్లి, అక్కడ ప్రమాదవశాత్తూ పడిపోయి, ప్రాణాలతో తిరిగి ఇండియాకు వచ్చిన ధీశాలి. తాను ఇండియాకు చెందిన ఎటువంటి రహస్యాలనూ వెల్లడించేది లేదని ఖరాకండీగా చెప్పి మీసం మెలేసిన ధైర్యవంతుడు. భారత ఘనతను, వాయుసేన పాటవాన్ని చాటిచెప్పిన అభినందన్, ఇప్పుడు యువతకు ఆరాధ్యుడయ్యాడు.
ఆయనకు ఉన్న మీసం ప్రత్యేక ఆకర్షణగా నిలువగా, ఇప్పుడు అదే తరహా మీసాన్ని యువకులు కోరుకుంటున్నారు. అభీ మీసకట్టు కావాలని వస్తున్న యువకుల సంఖ్య 50 శాతం పెరిగిందని క్షౌరశాలల యజమానులు అంటున్నారు. ముఖ్యంగా బెంగళూరులో ఈ డిమాండ్ అధికంగా ఉందని, అభినందన్ ధైర్య సాహసాలు ఆయన మీసకట్టులోనే ఉన్నాయని, అదే పాక్ సైనికులను భయపెట్టిందని యువత భావిస్తోంది. రియల్ హీరో అభి తరహా మీసకట్టు కోసం నిత్యమూ తనవద్దకు 15 మంది వరకూ వస్తున్నారని, వీరికి 50 శాతం డిస్కౌంట్ ను కూడా ఇస్తున్నానని సమీర్ ఖాన్ అనే హెయిర్ సెలూన్ నిర్వాహకుడు వెల్లడించడం గమనార్హం.