గత కొంతకాలంగా ఆప్ ఎమ్మెల్యే అల్కా లంబా కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారని వార్తలు వస్తున్నాయి. నేడు ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో చర్చలు జరిపినట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులపై సోనియా గాంధీతో చర్చ జరిగింది. ఈ రోజు ఆమెతో అన్ని సమస్యలను చర్చించే అవకాశం వచ్చింది. రాజకీయాలు, పలు అంశాలపై చర్చించుకున్నాము, ఇవి ఇలాగే కొనసాగాలి.. అని ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని భావిస్తున్నారు.
అల్కా గత కొంతకాలంగా ఆప్పై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ తనను ట్విటర్లో అన్ఫాలో చేశారని, పార్టీ కార్యకలాపాలకు తనను కావాలనే దూరం పెడుతున్నారంటూ అల్కా ఆరోపించారు. 2020 అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ తరఫున పోటీ చేయనని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. 2013లో మీతో ప్రారంభమైన నా ప్రయాణం 2020 లో ముగుస్తుంది. పార్టీకోసం అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలకు అభినందనలు. మీరు దిల్లీలో బలమైన ప్రత్యర్థులుగా ఉంటారని ఆశిస్తున్నా. గత ఆరు సంవత్సరాలు చిరస్మరణీయమైనవి, నేను మీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా.. అంటూ గతంలో చెప్పారు.
మోడీ సమావేశాలు పెట్టుకుంటే తప్పు లేదా: చంద్రబాబు