ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలపై నకిలీ వీడియోలను ట్వీట్ చేసిన హోంమంత్రి అమిత్షా ఎన్నికల ప్రచారాన్ని 48 గంటలపాటు నిషేధించాలని ఆప్ డిమాండ్ చేస్తోంది. బీజేపీ సోషల్మీడియాలో ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లపై నకిలీ వీడియోలు పోస్ట్ చేస్తూ ఢిల్లీ వాసుల పరువుకు భంగం కలిగిస్తుందని ఆప్ నేతలు సంజయ్ సింగ్, పంకజ్ గుప్తా ఈసీకి ఫిర్యాదు చేశారు.
బీజేపీ ఎంపీలు గౌతమ్ గంభీర్, పర్వేశ్ వర్మ, హన్స్రాజ్ హన్స్ ఢిల్లీ స్కూళ్లకు సంబంధించి కల్పిత ఫొటోలు, వీడియోలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని, ముగ్గురు ఎంపీలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై హోంమంత్రి అమిత్ షా షేర్ చేసిన వీడియోలు వాస్తవం కాదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు.