ఐపీఎల్ 2021 వాయిదా పడిన విషయం తెలిసిందే. పలు జట్లలో కరోనా కేసులు పెరగడంతో గత మంగళవారం అనూహ్య పరిస్థితుల్లో ఐపీఎల్ 2021ను బీసీసీఐ నిరవధిక వాయిదా వేసింది. ఐపీఎల్ 2021లో మొత్తం 60 మ్యాచ్లకు గాను.. మంగళవారం లీగ్ ఆగిపోయేసమయానికి 29 మ్యాచులే పూర్తయ్యాయి. మిగిలిన 31 మ్యాచ్ల్ని ఎప్పుడు నిర్వహిస్తారో స్పష్టంగా తెలియడం లేదు. అయితే భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ఐపీఎల్ 2021లోని ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఓ జట్టును రూపొందించాడు. తన జట్టులో ఆకాశ్ ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్లను ఎంపిక చేసుకున్నాడు. చెన్నై జట్టుకు ఓపెనర్ మంచి ఆరంభాలు ఇచ్చిన ఫాఫ్ డుప్లెసిస్ను మూడో స్థానం కోసం ఎంచుకున్నానని ఆకాశ్ తెలిపాడు. నాలుగులో గ్లెన్ మాక్స్వెల్, ఐదులో ఏబీ డివిలియర్స్, ఆరులో రిషబ్ పంత్ను తీసుకుని ఆకాశ్ చోప్రా తన ఐపీఎల్ జట్టు మిడిలార్డర్ని బలోపేతం చేశాడు.ఇక ఆల్రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, క్రిస్ మోరీస్లను సెలెక్ట్ చేసిన ఆకాశ్ చోప్రా.. జడేజాకి జోడీగా స్పిన్నర్ రాహుల్ చహర్ని తీసుకున్నాడు. పేస్ బౌలింగ్ విభాగంలో అవేష్ ఖాన్, హర్షల్ పటేల్కి చోటిచ్చిన చోప్రా.. క్రిస్ మోరీస్ రూపంలో మూడో పేసర్ అందుబాటులో ఉంచుకున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఆకాశ్ చోప్రా ఐపీఎల్ జట్టు
కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్వెల్, ఏబీ డివిలియర్స్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, క్రిస్ మోరీస్, రాహుల్ చహర్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్.