హైదరాబాద్లోని జనరల్, హెడ్, సబ్ పోస్టాఫీసుల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేసిన తపాలా శాఖ తాజాగా ప్రజల ఇంటి వద్దకే వెళ్లి ఆధార్ సేవలు అందించాలని నిర్ణయించింది. ఆధార్ నమోదు, చేర్పులు, మార్పుల సేవలు అవసరమున్నట్లు సమాచారం అందిస్తే చాలు.. డోర్ వద్దకు వచ్చి సేవలందించనుందనుందని అధికారులు తెలుపుతున్నారు. గత రెండున్నరేళ్ల క్రితమే జాతీయ స్థాయిలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తో ఒప్పందం కుదుర్చుకున్న పోస్టల్ శాఖ ఆధార్ అధీకృత కేంద్రాలను ఏర్పాటు చేసి సేవలు అందిస్తుండగా. ఎప్పుడైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ప్రైవేటు సంస్థలూ కూడా ఆధార్తో తమ సేవలను అనుసంధానం చేయడంతో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ తప్పనిసరిగా మారింది.
ఇప్పటికే కొత్తగా పుట్టిన శిశువులు, చిన్నారులు మినహా దాదాపు ప్రతి ఒక్కరూ ఆధార్ నమోదు చేసుకున్నప్పటికీ పేరు, ఇంటి పేర్లలో అక్షర దోషాలు, సవరణలు, చిరునామాలు, మొబైల్ నెంబర్ల లింకేజీ, మార్పు కోసం ఆధార్ కేంద్రాలకు పరుగులు తీయక తప్పడం లేదు. దీంతో ఆధార్ కేంద్రాలకు డిమాండ్ పెరిగింది. అందుకోసమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని వెల్లడించారు. ఇకపోతే ఆధార్ సేవలు అవసరమున్న వారు కనీసం 30 మంది ఉంటే చాలు వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఆధార్ సేవలందిస్తారు. ఇందుకు గాను కేవలం విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తే చాలు. అపార్ట్మెంట్, వీధి, కాలనీ కమిటీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. నేరు గా సెల్ నెంబర్ 9440644035ను సంప్రదించవచ్చు అని పోస్టల్ శాఖ అధికారులు తెలిపారు.