కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రైతు పథకానికి ఆధార్ తప్పనిసరి అని తేల్చింది. అయితే ఇంకా ఆధార్ రానివారు తగిన ఐడి ప్రూఫ్ చూపించి, సాయం పొందవచ్చని అధికారులు తెలిపారు. ఆధార్ కు ప్రత్యామ్నాయంగా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ స్లిప్ లేదా ఓటర్ ఐడీ, పాన్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, రేషన్ కార్డు, ఫొటో ఉన్న బ్యాంకు, పోస్టాఫీసు పాసు పుస్తకం, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డు, కిసాన్ ఫొటో పాసు పుస్తకం, గెజిటెడ్ అధికారి, తహసీల్దార్ అధికారిక పత్రంపై జారీ చేసిన ఫొటో ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాలని కేంద్ర వ్యవసాయ శాఖ సూచించింది.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏటా రూ.6 వేలు రైతులకు అందించనున్నట్లు ఇటీవల బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సాయం పొందాలంటే ఆధార్ కార్డు ఉండాలని లింక్ పెట్టింది. ఆధార్ కార్డు లేని రైతులు తక్షణం దరఖాస్తు చేయాలని సూచించింది. అయితే, అంతవరకు ఆధార్ కార్డు ఉన్నప్పటికీ వేలిముద్రలు సరిగా పడక గుర్తింపు విఫలమైతే ఐరిస్, ముఖ ధ్రువీకరణ (ఫేస్ ఐడెంటిఫికేషన్) ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని స్పష్టం చేసింది.
అలా కూడా కుదరని పక్షంలో లబ్ధిదారుని రిజిస్టర్డ్ ఫోన్ నంబర్కు ఓటీపీ పంపడం ద్వారానో, ఆధార్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారానో వివరాలను ధ్రువీకరించుకోవాలని సూచించింది. ఇందుకోసం క్యూఆర్ కోడ్ రీడర్లు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.