విజయవాడ శివారులో ఒక్కసారిగా కాల్పులు కలకలం రేపాయి. ఓ యువకుడిని అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కాల్చిచంపారు. మృతుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే మహేష్ గా గుర్తించారు. ఈ ఘటన విజయవాడ శివారు బైపాస్ రోడ్డులోని బార్ సమీపంలో చోటుచేసుకుంది. నిందితులు పక్క ప్లాన్ ప్రకారమే మహేష్ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మర్డర్ జరిగిన ఘటనా స్థలాన్ని సీపీ బత్తిన శ్రీనివాసులు అర్ధరాత్రి పరిశీలించారు.
నిందితుల ఆచూకీ కోసం పోలీసు బృందాలు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే.. ఈ కాల్పుల ఘటనకు కారణం రియల్ ఎస్టేట్ వివాదం కారణం కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్కూటీపై వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. కాల్పులు జరిగే సమయంలో మృతుడు మహేష్తో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని సీపీ బత్తిన శ్రీనివాసులు చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.