కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలుగా చర్యలను చేపడుతున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా షూటింగ్లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. పలువురు సెలబ్రిటీలు ప్రభుత్వాలకు విరాళాలను అందించడమే కాకుండా నైతికంగా తమ మద్దతుని తెలియజేస్తున్నారు. టాలీవుడ్ సిసిసి మనకోసం అనే సంస్థను ఏర్పాటు చేసి పేద కార్మికులను ఆదుకునేందుకు సెలబ్రిటీలందరూ ముందుకొస్తున్నారు. ఇప్పటికే సెలబ్రిటీల విరాళాలతో సహాయ కార్యక్రమాలు మొదలయ్యాయని ఆ సంస్థ ప్రకటించింది. ఇక మంచు ఫ్యామిలీ.. ఈ సంక్షోభంలో 8 గ్రామాలను దత్తత తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచింది. మంచు మోహన్ బాబు తన పెద్దకుమారుడు మంచు విష్ణుతో కలిసి చంద్రగిరి నియోజక వర్గంలోని 8 గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఈ లాక్డౌన్ ఉన్నంతకాలం ఆ 8 గ్రామాల బాధ్యత మాదేనని వారు అంటున్నారు. దత్తత తీసుకున్న గ్రామాలకు ఇప్పటికే సహాయ కార్యక్రమాలను వారు అందిస్తున్నారు. ప్రతిరోజూ 8 టన్నుల కూరగాయలను, నిత్యావసర వస్తువులను అందిస్తున్న వారు ప్రతి ఇంటికి మాస్క్లు, శానిటైజర్స్ ఇస్తూ.. కరోనా బారిన పడకుండా ఎలా ఉండాలో వివరిస్తున్నారట. మంచు ఫ్యామిలీ తమ గొప్ప మనసును చాటుకుందని అంతా అనుకుంటున్నారు.
previous post