కమ్యూనికేషన్ వ్యవస్థలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న క్రమంలో సైతం గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని, ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని దేశాల్లో జనాభాతో ఫోన్ల వినియోగం పెరుగుతుందని సెంటర్ ఫర్ టెలికామ్ మేనేజ్మెంట్ అండ్ స్టడీస్ డైరెక్టర్ పద్మశ్రీ డాక్టర్ టీహెచ్ చౌదరి అన్నారు. ‘వరల్డ్ టెలికామ్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే’ పురస్కరించుకొని శుక్రవారం ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్యభవన్లో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా 750 కోట్ల మంది జనాభాలో 650 కోట్ల మంది సెల్, ల్యాండ్ ఫోన్ల వినియోగదారులు ఉన్నారని తెలిపారు. కొన్ని దేశాల్లో జనాభాతో సమానంగా ఫోన్ల వినియోగదారులున్నారని చెప్పారు.
భారతదేశంలో 130కోట్ల జనాభా ఉంటే 120 కోట్ల మంది ఫోన్ల వినియోగదారులు ఉండటం విశేషమన్నారు. మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్కత్తా తదితర నగరాల్లో ఫోన్ల సంఖ్య అధికంగా ఉన్నాయన్నారు. సామాన్యులందరికీ టెలికాం శాఖ కొన్ని కంపెనీల గుత్తాధిపత్యానికి చరమగీతం పాడటంతో అనేక ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చాయని, దీంతో ప్రజలకు సెల్ఫోన్లు మరింత చేరువయ్యాయన్నారు. స్మార్ట్ ఫోన్లు వినియోగంలోకి వచ్చిన తర్వాత అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువైందన్నారు. కంప్యూటర్, రేడియో, టీవీ, ఇంటర్నెట్, వీడియో కాలింగ్, చిత్రాలు, మెసేజ్లు అన్ని స్మార్ట్ ఫోన్ల ద్వారా వినియోగించుకుంటున్నారని అన్నారు. భారతదేశంలో సామాన్యుడు రోజుకు రూ.150 చొప్పున సెల్ఫోన్ సేవలను వినియోగించుకుంటున్నాడని తెలిపారు. అలాగే పోస్టల్ రంగంలో కూడా డిజిటలైజేషన్ ద్వారా ప్రజలకు మరింత సేవలను మెరుగుపర్చారన్నారు.
ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా, తెలంగాణ స్టేట్ సెంటర్ చైర్మన్ డాక్టర్ జి.రామేశ్వర్రావు, న్యూఢిల్లీ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ హెడ్ తేజ్పాల్ భాటియా, ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ చైర్మన్ ప్రొఫెసర్ ఎ.రవికుమార్, కార్యదర్శి రాజేశ్కుమార్, సిఫ్ట్ టెక్నాలజీస్ సీఎఫ్ఓ ఎంపీ విజయ్కుమార్, సిఫీ టెక్నాలజీస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సీఆర్ రావు, ఐఈఐ కార్యదర్శి టి. అంజయ్య, సహాయ కార్యదర్శి ప్రొఫెసర్ డాక్టర్ రమణా నాయక్, సభ్యులు బి.బ్రహ్మారెడ్డి, కె.సుబ్బిరెడ్డి తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.