రాజస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి ఊరేగింపుగా వెళ్తున్న కారు అదుపుతప్పి.. కోటలోని నయాపురా కల్వర్టు నుంచి చంబల్ నదిలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో వరుడు సహా 9 మంది దుర్మరణం చెందారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో జిల్లా యంత్రాంగం, పోలీసులు సహాయచర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో నదిలో పడిపోయిన కారును బయటకుతీశారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో ఇలాంటి ఘటన జరగడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.