భారత యువ క్రికెటర్ పృథ్వీషా డోపింగ్ పరీక్షలో విఫలమైనందున అతడిపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. 8 నెలల పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో భాగంగా ఇండోర్లో మ్యాచ్ ఆడుతుండగా అతడికి డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ముంబయి క్రికెట్ సంఘం అనుబంధ ఆటగాడైన పృథ్వీషా నమూనాల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు ఉన్నట్టు తేలింది. షా రక్త నమూనాల్లో ‘టర్బుటలైన్’ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో డోపింగ్ నిబంధనల ఉల్లంఘన కమిటీ బీసీసీఐ ఏడీఆర్ ఆర్టికల్ 2.1 ప్రకారం అతడిపై చర్యలు తీసుకుంది. అతడిపై ఎనిమిది నెలల నిషేధం మార్చి 16 నుంచి నవంబర్ 15 వరకు కొనసాగుతుంది.
అతడితో పాటు విదర్భ ఆటగాడు అక్షయ్ దలర్వార్, రాజస్థాన్ ఆటగాడు దివ్య గజరాజ్ సైతం డోపింగ్ పరీక్షల్లో విఫలమయ్యారు. టర్బుటలైన్ సాధారణంగా దగ్గు మందులో ఉంటుంది. అనుకోకుండా తాను దగ్గు మందు తీసుకోవడంతో నిషేధిత ఉత్ప్రేరకం తన శరీరంలో ఉండిపోయిందని షా వివరణ ఇచ్చాడు. పంతొమ్మిదేళ్ల పృథ్వీషాను క్రికెట్లో సచిన్ వారసుడిగా భావిస్తారు. వెస్టిండీస్పై అతడు రెండు టెస్టులు ఆడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో సన్నాహక మ్యాచ్లో గాయం కావడంతో స్వదేశానికి తిరిగొచ్చాడు. చాన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందాడు. ఇప్పుడు నిషేధం విధించడంతో త్వరలో జరిగే బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్లకు అతడు దూరం కానున్నాడు.