ఎన్నిక దగ్గరపడుతున్న కొన్ని పార్టీలు మ్యానిఫెస్టోలో కొత్త కొత్త పథకాలు చేరుస్తూ పోతున్నారు. ప్రజల మనసులను ఆకట్టుకునేట్టుగా అనేక పథకాలలో మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా, ఏపీసీఎం మరో పథకం ద్వారా ప్రజలకు అందే సేవలను రెట్టింపు చేశారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన 1.47 లక్షల కుటుంబాలకు ఇది శుభవార్తే. ప్రస్తుతం వీరికి ఏడాదికి రెండున్నర లక్షల రూపాయల విలువైన వైద్యసేవలు అందుతుండగా, తాజాగా దీనిని రూ. 5 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్నటి నుండి (అంటే సోమవారం నుంచి) ఇది అమల్లోకి వచ్చింది.
ప్రారంభంలో ఈ వైద్యసేవలు తెల్లరేషన్ కార్డుదారులకు రూ.2 లక్షల విలువతో అందుబాటులో ఉండగా, 2015లో దీనిని రూ.2.50 లక్షలకు పెంచారు. ఇప్పుడు ఏకంగా రెట్టింపు అయింది. దీనితో కేన్సర్, గుండె జబ్బులతో పాటు ఖరీదైన జబ్బుల బారిన పడినవారికి వైద్య ఖర్చుల రూపేణా ఉపశమనం లభిస్తుందని ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు ఇన్చార్జి సీఈఓ డాక్టర్ సుబ్బారావు తెలిపారు.