దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ఉదయం నుంచి ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 55.52 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉదయం 11 వరకు 34.33 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియలో భాగంగా లచ్చపేటలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ పర్యటించారు. అక్కడ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. సాయంత్రం 5 గంటల వరకు సాధారణ ఓట్లకు ఓటేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు. ఇక చివరి గంటలో కరోనా బాధితులకు ఓటేసేందుకు అవకాశం కల్పించనున్నారు. కాగా..దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో ఓటు హక్కును టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత వినియోగించుకున్నారు. అటు బొప్పాపూర్ పోలింగ్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి రఘు నందన్ రావు ఓటు వేసారు. తొగుటలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితాలు 10 న వెలువడనున్నాయి.