తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు పిడుగుపాటుకు గురై మృతి చెందగా, మరొకరు గోడకూలి మృతి చెందారు. రాష్ట్రంలోని 62 ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నల్గొండ జిల్లా గుండాల మండలం బండకొత్తపల్లిలో తాటిచెట్టుపై పిడుగు పడడంతో గీతకార్మికుడు సత్తయ్య గౌడ్ (30) మృతి చెందాడు. వర్షం పడుతుండడంతో ధాన్యం కుప్పలపై పట్టాలు కప్పేందుకు వెళ్లిన కురుమర్తికి చెందిన చెన్నబోయిన రాణి (30), కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్కు చెందిన రైతు చిలువేరి సమ్మయ్య (55), పెద్దపల్లి జిల్లా మూలసాలలో గొర్రెల కాపరి అజయ్ పిడుగుపాటుకు గురై మృతి చెందారు. సుల్తానాబాద్ మండలం సుద్దాలలో గాలివానకు గోడకూలి భాగ్యమ్మ అనే మహిళ మృతిచెందింది.
నేటి నుంచి మరో నాలుగు రోజులపాటు బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో హిందూ మహాసముద్రాన్ని అనుకుని ఉన్న ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.