అమర్నాథ్ గుహను చేరుకునేందుకు 4,823 మంది యాత్రికులతో కూడిన మూడవ బృందం బేస్ క్యాంప్ నుండి బయలుదేరింది. సోమవారం సాయంత్రం నాటికి సుమారు 8,403 మంది యాత్రికులు హిమలింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లా నుండి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెహల్గామ్ మార్గం నుండి, గండెర్బల్ జిల్లా నుండి 14 కిలోమీటర్ల బాల్తాల్ మార్గం నుండి సాగే 46 రోజుల ఈ యాత్ర కోసం దేశవ్యాప్తంగా 1.5 లక్షల మంది యాత్రికులు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ మూడో బృందం 3,759 మంది పురుషులు, 936 మంది స్త్రీలు, 128 మంది సాధువులు ఉన్నారని, పెహల్గామ్, బాల్తాల్ల నుండి 223 వాహనాలు సిఆర్పిఎఫ్ సిబ్బంది భద్రతల మధ్య ఇక్కడి భగవతీనగర్ బేస్ క్యాంప్ నుండి బయలుదేరినట్లు తెలిపారు. కాగా, ఈ యాత్ర సోమవారం నుండి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 15న ముగిసే యాత్ర కోసం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. గతేడాది సుమారు 2.85 లక్షలమంది ఈ గుహను సందర్శించగా, వరుసగా 2015, 2016, 2017 సంవత్సరాల్లో 3.52 లక్షలమంది, 3.20 లక్షల మంది, 2.60 లక్షలమంది సందర్శించినట్లు అధికారులు తెలిపారు.