జిల్లాలోని బొబ్బిలి పట్టణంలో బాణాసంచా పేలిన ఘటనలో మూడు ఇళ్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. మరికొన్ని గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అదే వీధికి చెందిన జి.శ్రీనివాసరావు తన ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన జిలిటెన్స్టిక్స్ ప్రమాదవశాత్తు పేలాయి. ఈ ఘటనలో శ్రీనివాసరావు ఇంటితో పాటు పరిసరాల్లో ఉన్న జి.రమేశ్, సతీశ్ ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఆ శబ్దానికి స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు.
ఈ ప్రమాదంలో జి.భవాని, రామలక్ష్మితో పాటు పలువురు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం అందించడంతో పోలీసు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు నిల్వచేయడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.