హైదరాబాద్లో నిన్న కుండపోతగా కురిసిన వర్షానికి ప్రజలు వణికిపోయారు.. ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే భయం.. ఇక, లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దారుణం.. ఓవైపు ఇళ్లలోకి చేరిన నీరు.. మరోవైపు కరెంట్ లేకపోవడం.. ఆ నీటిలో ఏమొచ్చిందో తెలియని పరిస్థితి.. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు.. ఇక, రెండు రోజులు కావస్తున్నా.. కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్భందంలోనే ఉన్నాయి. మరోవైపు.. భారీ వర్షాలతో ప్రాణనష్టం కూడా భారీగానే సంభవించింది.. గత 24 గంటల్లో 29 మందిని వర్షం మింగేసింది. పల్లె చెరువులో ఆరుగురి మృతదేహాలు గుర్తించగా.. మరో 9 మంది గల్లంతయ్యారు.
ఎస్ఆర్ నగరలో ఇద్దరు మృతిచెందగా.. దిల్సుఖ్నగర్లో మూడేళ్ల చిన్నారి సెల్లార్ నీటిలో మునిగి మృతిచెందింది.. చాంద్రాయణగుట్ట బండ్లగూడ మహ్మద్నగర్లో ప్రహరీ గోడ కూలి.. పక్కనే ఉన్న రెండు ఇళ్లపై పడింది. దాంతో ఇళ్లలో నిద్రిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన తొమ్మిది మంది ఆ శిథిలాల మధ్య చిక్కుకుని మరణించారు. హయత్నగర్లో ఇద్దరు మృతిచెందగా.. నాగోల్లో పోస్ట్మన్ వరదనీటిలో కొట్టుకుపోయాడు.. అంబర్పేట్లో విద్యుత్ షాక్తో ఒకరు మృతిచెందారు.. బంజారాహిల్స్లోనూ మరో వ్యక్తి కరెంట్ షాక్తో కన్నుమూశారు. ఇక, హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం మండలంలో గోడకూలి తల్లి, కూతురు మృతిచెందారు.