telugu navyamedia
రాజకీయ వార్తలు

28న నూతన పార్లమెంటు భవనం ప్రారంభం

రూ. 970 కోట్ల అంచనా వ్యయంతో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల్లో నిర్మాణం

1,224 మంది ఎంపీలు కూర్చునే వీలు

భారత ప్రజాస్వామ్య వారసత్వానికి ప్రతీకగా రాజ్యాంగ మందిరం

రూ. 970 కోట్ల అంచనా వ్యయంతో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల్లో నిర్మించిన నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 28న ప్రారంభించే అవకాశం వుంది. దేశ ప్రజాస్వామ్య వారసత్వానికి ప్రతీకగా నిలిచేలా నిర్మించిన రాజ్యంగ మందిరంలో రాజ్యాంగం అసలు ప్రతిని ఉంచుతారు. అలాగే, 1,224 మంది ఎంపీలు కూర్చోనేలా హాలును తీర్చిదిద్దారు. ఈ నెల 28న దీనిని ప్రారంభించినా జులైలో జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాలు మాత్రం ఇందులో జరిగే అవకాశం లేదని సమాచారం. ఈసారి జీ-20 కూటమికి భారత్ సారథ్యం వహిస్తుండడంతో తొలుత 20 దేశాల పార్లమెంటు స్పీకర్లతో ఇక్కడ సమావేశం నిర్వహిస్తారు. సెంట్రల్ విస్టా పునర్నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా 10 డిసెంబరు 2020లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు. త్రిభుజాకారంలో ఉండే ఈ పార్లమెంటు భవనం పనులు 15 జనవరి 2021న ప్రారంభమయ్యాయి. నిజానికి గతేడాది ఆగస్టులోనే పనులు పూర్తికావాల్సి ఉండగా కరోనా కారణంగా 9 నెలలు ఆలస్యమైంది. ప్రస్తుతం నిర్మాణ పనులు పూర్తికాగా తుదిమెరుగులు దిద్దుతున్నారు. భవనంలోని మూడు ప్రధాన ద్వారాలకు జ్ఞాన, శక్తి, కర్మ అని పేర్లు పెట్టారు.

Related posts