భారత ఆటగాడు కుల్దీప్ యాదవ్కు వచ్చేఏడాది ఐపీఎల్ అత్యంత కీలకమని మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నారు. లీగ్లో రాణిస్తేనే టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కేందుకు అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. పొట్టి క్రికెట్ ఫార్మాట్లో దాదాపు తొమ్మిది నెలల తర్వాత కుల్దీప్ టీమిండియాకు ఎంపికయ్యాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడు చివరి టీ20 ఆడాడు. కుల్దీప్ యాదవ్ స్ట్రైక్రేట్లకు నేను పెద్ద అభిమానిని. వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీశాడు. పొట్టి క్రికెట్లోనూ అదరగొట్టాడు. ఇంగ్లాండ్లో మేం గెలిచిన మ్యాచ్ను చూస్తే అందులో ఐదు వికెట్లు తీశాడు. చివరి ఐపీఎల్ సీజన్ అతడికి కలిసిరాలేదు. అందుకే వచ్చే సీజన్ కుల్దీప్కు అత్యంత కీలకం. అతడు రాణిస్తే జట్టు నుంచి పక్కన పెట్టడం కష్టం.. అని బంగర్ అన్నారు.
యువ స్పిన్నర్ కృనాల్ పాండ్య కన్నా రవీంద్ర జడేజా ప్రపంచకప్ జట్టులో ఉండటం అవసరమని బంగర్ అభిప్రాయపడ్డారు. టీ20 ఫార్మాట్లో మణికట్టు స్పిన్నర్లు ఉండటం కీలకం. రెండేళ్లుగా మన మణికట్టు స్పిన్నర్ల ప్రదర్శనను చూశాం. టీ20ల్లో 4 ఓవర్లు వేసి 7వ స్థానంలో బ్యాటింగ్ చేయగల సమర్థులు అవసరం. ఈ విషయంలో కృనాల్ కన్నా రవీంద్ర జడేజా మెరుగు. ప్రస్తుతం అతడు అద్భుత ఫామ్లో ఉన్నాడని బంగర్ అన్నారు.