తెలంగాణతో పాటుగా ఎన్నికలు ఉండటంతో ఏపీ ఓటర్లు కూడా ప్రయాణాలకు సిద్ధమయ్యారు. అయితే ఇదే సమయంగా భావించి అధికారులు తమ తెలివితేటలు చూపిస్తున్నారు. దీనితో ఒక్క కావేరి ట్రావెల్స్ చాలా బస్సులను ఆపేయాల్సివచ్చింది. చివరి నిమిషంలో ఏకంగా 125 బస్సులను రద్దు చేయడంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. గురువారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని ఏపీ ఓటర్లు సొంతూళ్లు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పదో తేదీన (నేడు) ఊరు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. వీరిలా చాలా మంది ప్రైవేటు ట్రావెల్స్ను నమ్ముకున్నారు. అయితే, కావేరి ట్రావెల్స్ యాజమాన్యం అకస్మాత్తుగా 125 బస్సులను రద్దు చేయడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు.
తెలంగాణలో లైసెన్స్ లేదన్న కారణంతో తెలంగాణ ఆర్టీఏ అధికారులు మరికొన్ని ట్రావెల్స్ బస్సులను రద్దు చేశారు. దీనితో మొత్తంగా 200 వరకు బస్సులు నిలిచిపోయాయి. బస్సులు రద్దయ్యాయంటూ ప్రైవేటు యాజమాన్యాలు ప్రయాణికులకు మెసేజ్లు పంపడంతో ఇప్పటికిప్పుడు ఎలా వెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.