జమ్ముకశ్మీర్లో గడిచిన 36 గంటల్లో రెండు వేర్వేరు సంఘటనల్లో నలుగురు ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసినట్లుగా భద్రతాదళాలు పేర్కొన్నాయి. వీరిలో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన ఒక కమాండర్ కూడా ఉన్నాడని వెల్లడించాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బారాముల్లా జిల్లాలోని సోపోర్ టౌన్షిప్లో శుక్రవారం భద్రతాదళాలు చేపట్టిన తనిఖీల్లో భాగంగా ఇద్దరు తీవ్రవాదులను గుర్తించి ఎన్కౌంటర్ చేశారు. వారిలో ఒకరు కపొరా బందీపొరా ప్రాంతానికి చెందిన ఉమర్ షాహ్బజ్ వనీగా గుర్గించగా, మరొకరి వివరాలు తెలియరాలేదు. వీరిద్దరూ గతంలో జరిగిన ఆనేక దాడుల్లో కీలక నిందితులుగా ఉన్నట్లు భద్రతాదళాలు తెలిపాయి. వారి వద్ద నుంచి కొన్ని పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా షోపియాన్లోని పండుషాన్ ప్రాంతంలో జరిగిన మరొక ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదిన్ తీవ్రవాద సంస్థతో సంబంధాలున్న మంజూర్ భట్ అనే తీవ్రవాది భద్రతాదళాల కాల్పుల్లో మరణించాడు. అతడితో పాటు జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన కమాండర్, పాకిస్థాన్ జాతీయుడు జీనత్-ఉల్-ఇస్లాంనైకోను కూడా మట్టుబెట్టాయి. సుదీర్ఘమైన నేరచరిత్ర కలిగిన ఇతడు పోలీస్ స్టేషన్పై దాడి, నలుగురు పోలీసులను హతమార్చడం, షాకూర్ అహ్మద్ అనే పౌరుడిని అపహరించిన కేసుల్లో ప్రధాన నిందితుడని భద్రతా అధికారి వెల్లడించారు.