రెండు మిలియన్ డాలర్లు స్వచ్ఛంద సంస్థలకు చెల్లించాలని న్యూయార్క్ కోర్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని ఆదేశించింది. నిజానికి ఇది ఆయనకు ఓ రకంగా జరిమానా లాంటిదనే చెప్పాలి! ఆయన ఆధ్వర్యంలో నడుస్తోన్న ‘ట్రంప్ ఫౌండేషన్’కు వచ్చిన విరాళాలను దుర్వినియోగం చేశారని న్యూయార్క్ అటార్నీ జనరల్ జేమ్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ నిధుల్ని వాడుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ సాలియన్ స్కార్పుల్లా.. మొత్తం ఎనిమిది స్వచ్ఛంద సంస్థలకు ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు రెండు మిలియన్ డాలర్లు చెల్లించాలని తీర్పు వెలువరించారు.
దీనిపై స్పందించిన ట్రంప్.. అటార్నీ జనరల్ కావాలనే తీర్పును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ట్రంప్ ఫౌండేషన్ చేసిన కొన్ని చిన్న సాంకేతిక ఉల్లంఘనల నేపథ్యంలో కోర్టుతో ఓ ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఈ ఒప్పందాన్ని అటార్నీ జనరల్ కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం స్వచ్ఛంద సంస్థలకు రెండు మిలియన్ డాలర్లు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. దీనిపై ట్రంప్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. కఠిన శిక్షలు విధించాలన్న పిటిషనర్ అభ్యర్థనని కోర్టు తిరస్కరించిందని తెలిపారు.