రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి 26 నుండి కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నాయి. వైసీపీ ఎన్నికల మ్యానిఫేస్టోలో ఈ హామి ఉండటంతో ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించింది ప్రభుత్వం. సీఎం జగన్ వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ, ఒక్కో హామిని అమలు చేసేందుకు ముందడుగు వేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇప్పటికే ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు సీఎం జగన్ సమాచారం అందించటం జరిగింది. దీనికి గవర్నర్ కూడా గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు కొత్త జిల్లాల రూపకల్పనలో తలమునకలై ఉన్నారు. ముందుగా డివిజన్లు, మండలాలు నిర్ణయిస్తారు. ఆ తర్వాత గ్రామాల సరిహద్దులు నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఉన్న జిల్లాలు 13 మాత్రమే. దీంతో మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల నడుమ దూరం బాగా పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ పరిపాలన వికేంద్రీకరణ చేయాలని, ప్రజలకు పాలన అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సత్వరమే ప్రజలకు అందేలా చూడాలంటే ఇంకా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని సీఎం భావిస్తూ, ఏపీలో మరో 12 జిల్లాలను ఏర్పాటు చేసేయోచనలో ఉన్నారు.
ప్రస్తుతం ఉన్న జిల్లాలు : 1. శ్రీకాకుళం, 2. విజయనగరం, 3. విశాఖపట్నం, 4. తూర్పుగోదావరి, 5. పశ్చిమగోదావరి, 6. కృష్ణా, 7. గుంటూరు, 8. ప్రకాశం, 9. నెల్లూరు, 10. కడప, 11. కర్నూలు, 12. అనంతపురం, 13. చిత్తూరు లు ఉన్నాయి. వీటికి తోడుగా ప్రతి పార్లమెంట్ స్థానాన్ని మరో కొత్త జిల్లాగా చేయనున్నారు.
కొత్తగా రాబోతున్న జిల్లాలు : 1. అనకాపల్లి (విశాఖ), 2. అరకు (విశాఖ), 3. అమలాపురం (తూ.గో), 4. రాజమండ్రి (తూ.గో), 5 నరసాపురం (ప.గో), 6. విజయవాడ (కృష్ణా), 7. నరసరావుపేట (గుంటూరు), 8. బాపట్ల (గుంటూరు), 9. నంద్యాల (కర్నూలు), 10. హిందూపురం (అనంతపురం), 11. రాజంపేట (కడప), 12. తిరుపతి (చిత్తూరు) గా ఏర్పాటు చేయనున్నారు.