దేశంలో ఎటు చూసినా ఎన్నికల కళ కనిపిస్తుంది. మొత్తం ఏడు దఫాలుగా జరగనుండగా, నేడు కీలకమైన మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దేశంలోని 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 116 నియోజకవర్గాల నుంచి 1,640 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వాస్తవానికి మూడో దశలో భాగంగా 115 స్థానాల్లో పోలింగ్ జరగాల్సి ఉంది.
త్రిపురలోని త్రిపుర-తూర్పు లోక్సభ స్థానం ఎన్నిక రెండో దశ నుంచి మూడో దశకు వాయిదాపడింది. దీని తో నియోజకవర్గాల సంఖ్య 116కు చేరింది. రాహుల్గాంధీ, అమిత్షా, ములాయంసింగ్ యాదవ్, జయప్రద, వరుణ్ గాంధీ, సుప్రియా సూలె, శశిథరూర్, మల్లికార్జున్ ఖర్గే తదితరులు మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరోవైపు, ఒడిశాలోని 42 శాసనసభ స్థానాలకు కూడా పోలింగ్ ప్రారంభమైంది.