తెలంగాణ జనగామ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఛత్తీస్ఘడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి అవి బస్సు మొత్తానికి వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమయింది.
వివార్లాలోకి వెళితే..
చత్తీస్ఘడ్ జగ్దేవ్పూర్కు చెందిన కృష్ణ ట్రావెల్స్ బస్సు ఆదివారం రాత్రి 26 మంది ప్రయాణీకులతో హైదరాబాద్కు బయలుదేరింది. నెల్లుట్ల వద్దకు చేరుకోగానే బస్సులో నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపి ప్రయాణీకులను అప్రమత్తం చేశాడు. దీంతో వారంతా క్షణాల్లోనే బస్సులో నుంచి కిందికి దిగిపోయారు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే బస్సు మంటల్లో చిక్కుంది.
అయితే డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణాపాయం నుండి 26 మంది ప్రయాణికులు బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు అంటుకున్నట్లు బస్సు సిబ్బంది తెలిపారు. మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.