telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజకు మాతృవియోగం

THammareddy

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ తల్లి కృష్ణ‌వేణి సోమ‌వారం మృతి చెందారు. ఆమె వయసు 94 సంవత్సరాలు ఆమె గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. త‌మ్మారెడ్డి భ‌రద్వాజ తండ్రి కృష్ణ‌మూర్తి కూడా చిత్ర నిర్మాతే. ఆయ‌న ర‌వీంద్ర ఆర్ట్స్ ప‌తాకంపై ‘ల‌క్షాధికారి’, ‘జ‌మీందారు’, ‘బంగారు గాజులు’, ‘ధ‌ర్మ‌ధాత‌’, ‘ద‌త్త పుత్రుడు’, ‘డాక్ట‌ర్ బాబు’ త‌దిత‌ర అనేక విజ‌య‌వంత‌మైన చిత్రాలు నిర్మించారు. ఈ దంపతుల‌కు ఇద్ద‌రు కుమారులు. పెద్ద కుమారుడు లెనిన్ బాబు కూడా చ‌నిపోయారు. చిన్న కుమారుడు భ‌రద్వాజ నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా అనేక విజ‌య‌వంతమైన చిత్రాలు అందించారు. మొద‌టి నుంచి వీరిది వామ‌ప‌క్ష భావాలున్న కుటుంబం. ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ.. అనారోగ్యంతో త‌న త‌ల్లి రెండు నెల‌లుగా ఇబ్బంది ప‌డుతున్నార‌ని తెలిపారు. త‌న మిత్రులు, శ్రేయోభిలాషులు చాలా మంది ఫోన్లు చేస్తున్నార‌ని, క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్నందున త‌న‌ను ప‌రామ‌ర్శించ‌డానికి ఎవ‌రూ ఇంటికి రావ‌ద్ద‌ని ఆయ‌న కోరారు. కృష్ణ‌వేణి మ‌ర‌ణ వార్త తెలిసిన వెంట‌నే.. మెగాస్టార్ చిరంజీవి ఫోన్‌లో భ‌ర‌ద్వాజ‌ను ప‌రామ‌ర్శించారు. ‘సినిమా ఒక మ‌జిలీ.. స‌మ స‌మాజం నా అంతిమ ల‌క్ష్యం’ అనే కృష్ణ‌మూర్తి తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు ఇతోదిక సేవ‌లందించారని గుర్తు చేసుకున్నారు చిరంజీవి. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని సంతాప సందేశాన్ని తెలియ‌జేశారు.

Related posts