ఏపీలోని కొత్త జిల్లాల ఏర్పాటుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ప్రజాభిప్రాయానికి ఏ మాత్రం విలువ ఇవ్వకుండా పాలకుల చిత్తానికి తోచిన విధంగా ముందుకు వెళ్లారని పవన్ కల్యాణ్ విమర్శించారు. లోపభూయిష్టంగా జిల్లాల విభజన జరిగిందని అన్నారు.
పార్లమెంట్ నియోజకవర్గమే ప్రామాణికం.. అదే హేతుబద్ధత అని చెప్పుకుంటున్న ఏపీ ప్రభుత్వం ప్రజల మనోగతాన్ని, కొత్త జిల్లాల ఏర్పాటుతో వారు ఎదుర్కొనే దూరాభారాలు, ఇబ్బందులను ఎందుకు పరిగణించలేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
ఎప్పటినుంచో జిల్లా కోసం డిమాండ్ ఉన్న ప్రాంతాలపై అధ్యయనం కూడా చేయలేదు. పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాలో ముంపు మండలాల గిరిజనులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఎటపాక, కుకునూరు లాంటి మండలాల్లోని గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే కనీసం 300 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాలి. సామాన్య, పేర గిరిజనులు జిల్లా కేంద్రంలో అధికారిని కలవాలంటే కనీసం రెండు రోజుల సమయం పడుతుందని పవన్ అభిప్రాయపడ్డారు.
ఈ తరహా విభజన వల్ల ప్రజలకు పాలనను ఏ విధంగా చేరువ చేస్తున్నారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాకినాడ కేంద్రంగా ఉన్నప్పుడూ ముంపు మండలాల వారికి ఇదే తరహా ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరవాత కూడా ఆ ఇబ్బందులు తప్పడం లేదన్నారు.
రంపచోడవరం జిల్లా కేంద్రంగా ఉండాలనే అక్కడి గిరిజనుల అభిప్రాయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. రాయలసీమలోనూ ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోలేదని అన్నారు. మదనపల్లె, హిందూపురం, మార్కాపురం కేంద్రాలుగా జిల్లాలు ఉండాలనే డిమాండ్లు ఉన్నాయని పవన్ గుర్తుచేశారు.
కొత్త జిల్లాల ఏర్పాటు అంశంలో ప్రజలు ప్రజలు, పార్టీలు, ప్రజా సంఘాలలో ఏ ఒక్కరి నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోలేదని పవన్ కల్యాణ్ ఆరోపించారు. డ్రాఫ్ట్ ఇచ్చే ముందు చర్చలు జరపలేదని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన వినతులను కనీసం పరిగణలోకి తీసుకోలేదన్నారు
ఈ అంశంలో ప్రజాభిప్రాయం, వారు చేస్తున్న నిరసనల సమాచారం ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి నుంచి జనసేన పార్టీ కార్యాలయానికి చేరుతోందని పవన్ తెలిపారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో లోపాలు, అసౌకర్యంగా ఉన్న విషయాలపై ప్రజలు చేసే నిరసనలకు జనసేన అండగా ఉంటుందని ప్రకటించారు. తర్వాత వీటిని చక్కదిద్ది.. ప్రజా సౌకర్యమే ప్రధానంగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించే బాధ్యతను జనసేన తీసుకొంటుందని చెప్పారు
అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా సమస్యలకు పరిష్కారం: చంద్రబాబు