తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని తిరుమలకు కాలినడక మార్గంలో కొండపైకి చేరుకుని ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ తో కలిసి ఇవాళ శ్రీవారిని దర్శించుకున్నారు.
స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో కవిత-అనిల్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు, స్వామి వారి పట్టు వస్త్రాలను దంపతులకు అందజేశారు.
దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత ..చాలా కాలం తర్వాత శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజున స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చినట్లు చెప్పారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని వేడుకుంటున్నట్లు కవిత తెలిపారు. అలాగే ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రులు ఆరోగ్యంగా ఉండి ప్రజలకు మరింత సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని శ్రీనివాసుడ్ని ప్రార్ధించినట్లుగా కల్వకుంట్ల కవిత తెలియజేశారు.
దేశానికి సంబంధించి సీఎం కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై చర్చ జరగాల్సిన అవసరముందని… ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. చర్చ జరిగినప్పుడే అనేక అంశాలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరగడం ఆనందంగా ఉందన్న కవిత… 105 స్థానాల్లో డిపాజిట్ రాని భాజపా తెరాసపై దుష్ప్రచారం చేస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని బీజేపీ కోల్పోయిందని కవిత అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా కొత్త కూటమిని తయారు చేయడానికి కృషి చేస్తున్నారు. సీఎంలు మమత, స్టాలిన్, ఉద్దవ్, విజయన్ తదితర నేతలతో మాట్లాడుతూ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు.
కాలినడక మార్గంలో శ్రీవారిని దర్శించుకున్న కవిత..రాత్రికి తిరుమలలోనే బస చేసి శుక్రవారం ఉదయం మరోసారి స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుమల బస్ టికెట్లపై “జెరూసలెం”.. స్వరూపానంద ఫైర్