ఝార్ఖండ్లో చివరి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 16 అసెంబ్లీ స్థానాలకు చివరిదైన ఐదో దశ ఎన్నికల పోలింగ్ శుక్రవారం నిర్వహించగా.. సాయంత్రం ఐదు గంటల వరకు 70.83 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఐదు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 3 గంటలకే పోలింగ్ ముగియగా.. మిగిలిన చోట్ల 5 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం ప్రముఖ నేత హేమంత్ సోరెన్తో పాటు ఇద్దరు రాష్ట్ర మంత్రులు చివరి దశ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సరత్ నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించాలని భాజపా అభ్యర్థి, ఝార్ఖండ్ వ్యవసాయ శాఖ మంత్రి రణ్ధీర్ సింగ్ డిమాండ్ చేశారు. మొత్తం 81 స్థానాలకు ఐదు దశల్లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20 వరకు ఎన్నికలు జరిగాయి. ఈ నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి.