ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్ వీడియోకాన్ గ్రూప్-ఐసీఐసీఐ బ్యాంకు కుంభకోణం కేసులో విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఈ రోజు ఈడీ ఎదుట చందా కొచ్చర్ విచారణకు హాజరు కావలిసి ఉండగా ఆమె డుమ్మా కొట్టారు. అనారోగ్యం కారణంగానే తాను విచారణకు రాలేకపోతున్నట్టు ఆమె పేర్కొన్నట్టు అధికారులు వెల్లడించారు. దీంతో వచ్చే వారంలో ఈడీ ముందు విచారణకు హాజరవ్వాలంటూ ఆమెకు మళ్లీ నోటీసులు జారీ చేయనున్నారు.
గత వారం కూడా ఆనారోగ్య కారణాలతోనే ఆమె ఈడీ ముందుకు రాలేదు. చందా కొచ్చర్ చెప్పిన సమాధానాలపై మరింత మంది బ్యాంకు అధికారుల సమక్షంలో ప్రశ్నించి, ఆమె నుంచి వివరాలు రాబట్టనున్నట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. గత నెలలో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లను ప్రశ్నించిన ఈడీ, ఇద్దరి వాంగ్మూలాలను రికార్డు చేసింది. ఇదే కేసులో చందాకొచ్చర్ బావ, దీపక్ సోదరుడు రాజీవ్ కొచ్చర్ను కూడా ఈడీ పలుమార్లు విచారించింది.