టీమిండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించినా, క్రికెట్ ను పూర్తిగా వదిలేస్తున్నానని మాత్రం చెప్పలేదు. విదేశీ లీగుల్లో ఆడాలని అనుకుంటున్నానని, అందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వాలని నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతున్న వేళ వ్యాఖ్యానించాడు. యువరాజ్ కోరికపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందించారు. యువరాజ్ ఇంకా అనుమతి కోరుతూ బోర్డుకు లేఖ రాయలేదని, అందగానే పరిశీలిస్తామని అన్నారు.
యువరాజ్ ఐపీఎల్ ఆడటం లేదు కాబట్టి, విదేశీ లీగ్ పోటీల్లో పాల్గొనేందుకు అనుమతి నిరాకరించే అవకాశాలు తక్కువేనని ఆయన అన్నారు. ఇప్పటికే రిటైర్ మెంట్ ప్రకటించిన సెహ్వాగ్ విదేశీ క్రికెట్ ఆడుతున్నాడన్న సంగతి తెలిసిందే. దీంతో భారత క్రికెట్కు ఎంతో సేవ చేసిన యువరాజ్ ఆడితే తప్పేంటని, అతనికి మద్దతుగా నిలిచే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. ఇక యువీ విదేశాల్లో ఆడితే, అతని సొగసైన బ్యాటింగ్, కళ్లు చెదిరే ఫీల్డింగ్, సిక్స్ లు చూసే చాన్స్ ఉంటుందనడంలో సందేహం లేదు.