*రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు
*నామినేషన్ కార్యక్రమానికి ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముకు వైఎస్సాఆర్సీపీ మద్దతు తెలిపింది. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తున్న పార్టీగా వైసీపీ ఆమెకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
స్వంతంత్ర భారత చరిత్రలో రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు అవకాశం ఇవ్వడం శుభ పరిణామమని వైసీపీ పేర్కొంది.గత మూడేళ్లుగా దేశంలో ఎక్కడా లేని రీతిలో పెద్ద పీట వేస్తున్న పార్టీగా రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముకు మద్దతు తెలుపుతున్నట్లు వైసీపీ పేర్కొంది.
శుక్రవారం ఆమె నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఢిల్లీ రావాలని బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలందరినీ బీజేపీ నాయకత్వం ఆదేశించింది. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులూ హాజరయ్యే అవకాశముంది. వీరితోపాటు తాను కూడా వెళ్లాలని జగన్ భావించారు.
అయితే రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించాలని ముందుగా నిర్ణయించుకున్నందున ఆ రోజు రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరు కాలేకపోతున్నారు.
ఆయన స్థానంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్సభలో పార్టీ పక్ష నేత పీవీ మిథున్రెడ్డి పాల్గొననున్నారు.