ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుపై ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కులం, మతం చూడకుండా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తోందని చెప్పారు. అయినా రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను చూడకుండా ఈనాడులో వార్తలు వస్తున్నాయని దుయ్యబట్టారు.
రామోజీరావు వాస్తవాలను తెలుసుకోవాలని అన్నారు. రామోజీ ధృతరాష్ట్రుడిలా కళ్లు మూసుకోవద్దని హితవు పలికారు.కరోనా విషయంలో ఏపీకి సంబంధించి ఒకలా, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి మరోలా ఈనాడులో వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. ఈనాడు, ఎల్లో మీడియా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు.
కరోనా సమయంలో కూడా ప్రజల శ్రేయస్సు కోసం ఆరు నెలల్లో రూ. 28,122 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. జగన్ పాలనను చూసి టీడీపీ నేతలు అసూయ పడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట సమయంలో కూడా ప్రభుత్వంపై అసత్యాలను ప్రచారం చేయడం దారుణమని చెప్పారు.
వ్యవస్థ మారనంత కాలం రాజకీయ పెత్తనం: ప్రొఫెసర్ నాగేశ్వర్