కేంద్రం నుంచి ఆర్థిక సాయం కావాలని ప్రధాని మోదీని కోరానని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ ఆర్థిక పరిస్థితిని మోదీకి వివరించానని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం గురించి వివరించానని తెలిపారు.
రాష్ట్రం ఓవర్ డ్రాఫ్ట్ పై బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయని ప్రధానికి తెలిపినట్టు చెప్పారు. రాష్ట్రం విడిపోయే నాటికి రూ.97 వేల కోట్ల అప్పులు ఉంటే, బాబు ఐదేళ్ల పాలనలో రూ.2 లక్షల 57 వేల కోట్లకు అప్పులు చేరాయని అన్నారు. రాష్ట్ర సమస్యలపై ప్రధాని సానుకూలంగా స్పందించారని అనుకుంటున్నట్టు చెప్పారు. ప్రధానిని ఎప్పుడు కలిసినా ప్రత్యేక హోదా గురించి ప్రస్తావిస్తానని జగన్ పేర్కొన్నారు.