ఏపీ సీఎం చంద్రబాబు పై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. చంద్రగిరిలో గెలవలేనన్న భయంతో 30 ఏళ్ల క్రితం చంద్రబాబు తన నియోజకవర్గాన్ని కుప్పంకు మార్చుకున్నారని జగన్ అన్నారు. ఈ రోజు కుప్పంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబును చంద్రగిరి ప్రజలు తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఓ మారు చంద్రగిరి నుంచి గెలిచిన ఆయన, రెండోసారి భారీ తేడాతో ఓడిపోయారని, అదే స్ఫూర్తిని కుప్పం ప్రజలు ప్రదర్శించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. అప్పటి నుంచి ఆదరిస్తున్న కుప్పం ప్రజలకు ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు.
నియోజకవర్గ కేంద్రమైనప్పటికీ ఒక్క డిగ్రీ కాలేజీ కూడా లేదని, పొలాలకు సాగు నీరండడం లేదన్నారు. కుప్పంలో వైసీపీని గెలిపిస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తానని ప్రజలకు జగన్ హామీ ఇచ్చారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచిన ఈ పెద్దమనిషి, తన తల్లి పేరిట ఉన్న ఆస్తిని తన తోడబుట్టిన వాళ్లకు ఇవ్వకుండా కాజేశారని ఆరోపించారు. ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలని కుప్పం ప్రజలకు పిలుపునిచ్చారు.